నా ప్రాణానికి రక్షణ లేదు: ఏపీ ఈసీ
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో తన ప్రాణాలకు రక్షణ లేదని ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు 5 పేజీల లేఖ రాశారు.
స్థానిక ఎన్నికల వాయిదా రోజు నుంచీ తనపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ వ్యక్తిగత దూషణకు దిగారనీ, హీనమైన భాషతో తనను దూషించారనీ ఆ లేఖలో పేర్కొన్నారు.
అప్పటి నుంచీ తనకూ, తన కుటుంబ సభ్యులకూ కూడా బెదరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికీ రక్షణ కల్పించడానికి కేంద్ర బలగాలు కావాలని ఆయన ఆ లేఖలో కోరారు.
ఏపీలో తనకు భద్రత లేని దృష్ట్యా హైదరాబాద్ లో ఉండేందుకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు.
కడప జిల్లాలో ఒక్క ఓటు కూడా అవసరం లేకుండానే జడ్పీన కైవసం
కేంద్ర హోంమంత్రికి శాఖకు లేఖ రాసిన రమేష్ కుమార్ రాష్ట్రంలో ఎన్నికలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో ఒక్క ఓటు కూడా అవసరం లేకుండానే జడ్పీని కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. తనపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఎన్నికల అనంతరం కూడా కేసులు రుజువైతే అనర్హత, మూడేళ్ల జైలు వంటి క్రూరమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చారని రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/