ఈ ఏడాదీ చేప ప్రసాదం నిలిపివేత : బత్తిని గౌరీశంకర్‌

హైదరాబాద్: ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా వేసే చేపప్రసాదాన్ని పంపిణీ చేయడంలేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్‌ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో ఆస్తమా రోగులకు ఉచితంగా చేపప్రసాదాన్ని అందించామన్నారు. ఈ ఏడాది కూడా కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్పారు.

దీంతో చేపప్రసాదం కోసం హైదరాబాద్‌కు ఎవ‌రూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి దేశ, విదేశాల నుంచి కూడా అస్తమా రోగులు హైదరాబాద్‌ వచ్చేవారు. అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా చేప మందును పంపిణీ చేయడంలేదు. కరోనా నిబంధనలు అమల్లో ఉండటంతో ఈసారి కూడా ప్రసాదం పంపిణీకి బ్రేక్‌ పడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/