పైలట్ వర్గానికి హైకోర్టులో ఊరట
సచిన్ పైలట్ వాదనతో ఏకీభవించిన రాజస్థాన్ హైకోర్టు
రాజస్థాన్: రాజస్థాన్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టులో అశోక్ గెహ్లాత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యంగా చేర్చాలన్న తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. స్వీకర్ జారీచేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్కు అనుమతినిచ్చింది. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పీకర్ను ఆదేశించింది. పరిస్థితులు చక్కబడేవరకు సంయమనం పాటించాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా యథాతథ స్థితిని (స్టేటస్ కో) పాటించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది.
కాగా, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై నేడు తుది తీర్పు వెల్లడి కానుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. తీర్పు కనుక పైలట్ వర్గానికి అనుకూలంగా వస్తే మాత్రం గెహ్లాట్ సర్కారుకు ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు!
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/