మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు

జైలు అధికారులు పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేశారని పిటిషన్

nirbhayas-convicts
nirbhayas-convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే మొదటి డెత్ వారెంట్ జారీ చేయగా.. దానిపై దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ.. సమయం గడిచిపోయేలా చేశారు. దీంతో కోర్టు తాజాగా రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కూడా తప్పించుకునేందుకు దోషులు పవన్, అక్షయ్ ప్రయత్నాలు ప్రారంభించారు.

వీరిద్దరి తరపున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని న్యాయవాది పిటిషన్లో ఆరోపించారు. ఈ కారణంగా వారు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా, వీరి పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరుపనుంది. ఇప్పటివరకు వీరిద్దరూ క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోలేదు. నలుగురు దోషుల్లో మరో దోషి ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/