ఆత్మహత్యాయత్నం చేసిన నిర్భయ దోషి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తీహార్ జైల్లో కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఉన్నప్పటికి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. నిర్భయ కేసులో దోషులుగా తేల్చిన నలుగురిని మార్చి 3న ఉరితీయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా దోషులు ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పలు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో దోషి వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. తనను ఉంచిన సెల్ లో గోడకు తలను బాదుకున్నాడని, ఈ ఘటనలో వినయ్ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో ఎలాంటి జాప్యం చోటు చేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి అభిలషించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకూ తన ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని దోషి పవన్ గుప్తా, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో 3వ తేదీన వారి ఉరి అనుమానంగానే ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/