యాసంగిలో ఏ పంట వేయాలో తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి

యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ యాసంగి లో మినుములు విరివిగా సాగు చేయాలని కోరారు. పూర్తి స్థాయి లో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300గా ఉందని వెల్లడించారు.

మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ నాఫెడ్ సంస్థను సంప్రదించింది. రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ సంస్థ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలన్నారు.