ఏపీ సినిమా టికెట్స్ ధరల ఫై హీరో నిఖిల్ ట్వీట్

ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో చిత్ర సీమా మండిపడుతుంది. ఇప్పటికే పలువురు హీరోలు , నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..తాజాగా హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసారు.
‘‘ధియేటర్స్ నాకు గుళ్లతో సమానం. ఎప్పుడూ ప్రజలకు ఆనందాన్ని పంచుతుంటాయి. అలాంటి థియేటర్స్ మూతపడటం చూస్తుంటే గుండె పగిలిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సపోర్ట్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా థియేటర్స్ మళ్లీ కళ కళలాడేలా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను.
నాకు తెలిసి ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.20 టికెట్ కూడా ఉంది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి. మనం ప్రయాణించే ట్రెయిన్లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా.. అలాగే థియేటర్లోని బాల్కనీ, ప్రీమియమ్ సెక్షన్ సీట్స్కు కాస్త టికెట్ ధరను పెంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే..నిఖిల్ హీరోగా నటించిన 18 పేజీస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు తన కెరీర్లో బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న కార్తికేయ 2 చిత్రంలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.