సిద్ధూ మూసేవాలా హత్య కేసు..50ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

nia-today-raided-around-50-locations-across-north-india

న్యూఢిల్లీః పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత ఉగ్రవాద ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లోని 50ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దులో నిందితుడు షూటర్ దీపక్ ముండితో పాటు అతని ఇద్దరు సహాయకులను అరెస్టు చేశారు. దీంతో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 23కు చేరుకుంది. ఈ నిందితులు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఈ ఇద్దరు వ్యక్తులను కపిల్ పండిట్, రాజిందర్ అలియాస్ జోకర్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలతో పాటు పంజాబ్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (AGTF) ​​సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

కాగా, ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయేనని పోలీసులు వెల్లడించగా.. మరో ఆరుగురిపై ఆరోపణలు వచ్చాయి. అందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇద్దరు పోలీస్ ఎన్ కౌంటర్లో మృతి చెందగా… పరారీ ఉన్న ఆఖరి వ్యక్తి దీపక్ ను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/