విశాఖ ఏజెన్సీలో లేటరైట్ తవ్వకాలపై కమిటీ ఏర్పాటు

ఎన్జీటీ చెన్నై బెంచ్ లో కొండ్రు మరిడయ్య పిటిషన్

న్యూఢిల్లీ : విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కొండ్రు మరిడయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ నుంచి ఒక సీనియర్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్, రాష్ట్ర గనుల శాఖ నుంచి ఒక సీనియర్ అధికారి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశించింది.

కాగా, అనుమతులకు మించి మైనింగ్ జరుగుతోందని, వేల చెట్లను ధ్వంసం చేసి రోడ్లు వేశారని మరిడయ్య తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ రీజినల్ బెంచ్ మైనింగ్ పేరిట అక్రమాలు నిజమేనని నిర్ధారించింది. అనుమతించిన పరిధి ధాటి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మైనింగ్ జరిగినట్టు గుర్తించింది. చెట్ల కూల్చివేతను తప్పుబట్టింది. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/