ఢిల్లీలో కరోనాను కట్టడి చేయగలిగాం
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనాను సమర్ధవంతంగా అదుపు చేయగలిగామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ‘జూన్ 30 నాటికి ఢిల్లీలో లక్ష కోవిడ్ కేసులు, 60,000 యాక్టివ్ కేసులు అంచనా వేయగా, ఇవాళ 26,000 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరి కఠోర పరిశ్రమ వల్లే సమర్ధవంతంగా పరిస్థితిని అదుపు చేయగలిగాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆశలు వదలుకోవడం కానీ, చేతులెత్తేయడం కానీ తాము చేయలేదని, ఎక్కడి నుంచి సహాయం కావాల్సి ఉన్నా అడిగి మరీ తీసుకున్నామని చెప్పారు. తాము కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచామని కేజ్రివాల్ చెప్పారు. అయితే ఇటీవల ప్రతి 100 టెస్టుల్లో 31 మందికి పాజిటివ్ వచ్చేదని, ఇప్పుడు ప్రతి 100 టెస్టుల్లో సగటున 13 మంది మాత్రమే పాజిటివ్ వస్తున్నదని ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని సంతోషంతో చక్కలు గుద్దుకునే పరిస్థితి లేదని, కరోనా మహమ్మారి ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో అంచనా వేయలేమని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/