ప్రజలకు 74వ స్వాతంత్రదినోత్సవ సందేశం
శాంతినే కోరుతాం.. సమరానికీ వెనుకాడం
న్యూఢిల్లీ: 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశప్రజలకు సందేశం ఇచ్చారు. విస్తరణ కాంక్షతో సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు కోవింద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భారతదేశం శాంతినే నమ్ముతుందని, కానీ, అవసరమైతే శత్రువుకు గట్టి గుణపాఠం చెప్పగల సామర్థ్యమూ తమకు ఉందని స్పష్టంచేశారు. కరోనా సంక్షోభం, ఆత్మనిర్భర్ భారత్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ అమరులైన సైనికులకు రాష్ట్రపతి నివాళలు అర్పించారు. సరిహద్దులను కాపాడుతున్న సైనికులతోపాటు దేశ అంతర్గత శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీసుల సేవలను రాష్ట్రపతి ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి స్వాగతించారు. నూతన జాతీయ విద్యావిధానం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవటానికి ఎంతో అవసరమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు ఇతర కరోనా యోధులకు దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/