వ్యాక్సిన్ వచ్చేంత వరకూ కరోనాతో పోరాటం చేయాల్సిందే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మణిపూర్లో నీటి సరఫరా ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది ‘రక్షాబంధన్ బహుమతి’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రాజెక్టు మణిపూర్లోని 1,700 గ్రామాలకు మంచి నీటిని అందిస్తుంది. జీవనాధారాన్ని కూడా కల్పిస్తుంది. ఓ లక్ష కుటుంబాలకు ఆసరా అవుతుంది.’ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును స్థానిక సంస్థల సహాయంతోనే రూపకల్పన చేశామని, అధికార వికేంద్రీకరణకు ఇది ఓ ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.
సమృద్ధి, పురోగతితో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, అనుసంధానమే అత్యంత ప్రధానమని ఆయన తెలిపారు. ఈ అనుసంధానం అనేది కేవలం ప్రజల జీవనాధారానికే కాదని, సురక్షితమైన, స్వావలంబన భారత్ కోసం కూడా ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ దేశం కరోనాతో పోరాటం చేయాల్సిందేనని ప్రధాని స్పష్టం చేశారు. కోవిడ్19తో దేశం క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నా సరే… దేశమేమీ ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్య భారతం ఒకే సమయంలో రెండు సమస్యలతో పోరాడుతోందని, ఒకటి కరోనా కాగా, మరొకటి వరదలు అని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని, చాలా మంది ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం వారి వెంటే ఉందని, దిగులు పడాల్సిన అవసరం లేదని మోడి భరోసా కల్పించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/