ఎర్రకోట నుండి దేశనుద్దేశించి ప్రధాని ప్రసంగం
ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం కావాలని ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు… భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీప శిఖలా నిలిచిందని ప్రధాని అన్నారు. భారతీయ రక్షణ దళాలు, పోలీసులు దళాలు మనల్ని నిరంతరం రక్షిస్తున్నాయన్నారు. దేశ సరిహద్దులో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు పోలీసులకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయణిస్తోందని, కరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రమాణం చేశారు. మహమ్మారి నివారణకు వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ ప్రజల ఆరోగ్యానికి కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టు ముట్టాయన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుధృడం చేస్తాయన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. కరోనా ఆపత్కాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందన్నారు. 25 ఏళ్లు వస్తేనే తన కొడుకు సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటుందని, కానీ 75 ఏళ్లు వచ్చినా దేశం మాత్రం స్వయం సమృద్ధి సాధించలేకపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదని, ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంగా మిగిలిపోకూడదని, అది అందరి సంకల్పం కావాలని మోడి పిలుపునిచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/