రెండో దశ ఎన్నికల ప్రచారంలో రాహుల్
పట్నా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంపారన్లో మాట్లాడుతూ..బిజెపి, జేడీయూ కూటమి బీహార్ను ధ్వంసం చేస్తుందని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని తన ప్రసంగంలో చెప్పడం లేదని రాహుల్ మండిపడ్డారు. తాను అబద్ధాలు చెబుతున్న సంగతి ఆయనతోపాటు ప్రజలకు కూడా తెలుసని విమర్శించారు. ప్రధాని ఇక్కడకు వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అంటే జనం ఆయనను గ్యారంటీగా తరిమికొడతారని అన్నారు. తమకు అబద్ధాలు చెప్పడం రాదని, అందుకే ఈ విషయంలో ప్రధాని మోడితో పోటీ పడలేమని ఆయన అన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ మార్గనిర్దేశం చేసిందని రాహుల్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టామని, రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. ఉద్యోగ కల్పనతోపాటు రైతులకు మద్దతుగా ఉంటూ దేశాన్ని ఎలా పరిపాలించాలో అన్నది కాంగ్రెస్ పార్టీకి తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అబద్ధాలు చెప్పడంలో మాత్రమే తాము వెనక ఉన్నామంటూ ఎద్దేవా చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/