ఈరోజు తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణం స్వీకారం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జీలను నియమించిన సంగతి తెలిసిందే. ఈరోజు మంగళవారం ఉదయం 10.45కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాళ్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ ప్రమాణం చేయిస్తారు. జడ్జిలుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్‌‌, నగేష్‌‌ భీమపాక, పుల్లా కార్తీక్‌‌ (పి.ఎలమాధర్‌‌), కాజ శరత్, అడిషినల్‌‌ జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌‌రావు బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కొత్త జడ్జిల నియామకాలకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్‌ గ్రీన్‌సిగ్నల్‌తో వారి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2019 జనవరి 1న ప్రత్యేక రాష్ట్ర హైకోర్టుగా తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. హైకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తులు 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. తాజాగా ఆరుగురి నియామకంతో ఆ సంఖ్య 34కి చేరింది. కాగా, ఏడాది వ్యవధిలో తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులుగా నియమించారు. ఇకపోతే తాజా ఉత్తర్వుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 6 హైకోర్టుల్లో 26 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. దాంతో ఏడాది కాలంలో దేశంలో 127 మంది జడ్జీల నియామకం జరిగింది.