తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం 

కొత్త పార్ల‌మెంటుకు అంబేద్క‌ర్ పేరు పెట్టాలి: మంత్రి కేటీఆర్‌

new-parliament-building-should-be-named-after-ambedkar-minister-ktr-demands-in-t-assembly

హైదరాబాద్ః నేడు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు. మహాత్మా గాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా .. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని 1949లోనే అంబేద్కర్ చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు.

‘చట్టాలు చేసే ముందు.. సంస్కరణలు చేసే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి’ అని చెప్పిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ‘లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ’తో సమాజం విలసిల్లాలని ప్రవచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ‘‘అంబేద్కర్ మార్గదర్శకత్వంలో టిఆర్ఎస్ పనిచేస్తుంది. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపిన ఆదర్శ నాయకుడు కెసిఆర్’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చని తెలిపే ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ కు తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు.

కాగా, కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. మంత్రి ప్ర‌వేశ పెట్టిన‌ తీర్మానాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదం తెలుప‌డానికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, సోద‌ర‌భావంతో దేశ నిర్మాణం సాగాల‌న్న అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను భ‌ట్టి గుర్తు చేశారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేద‌ని, ఎవ‌రైనా స్వేచ్ఛ‌గా మాట్లాడితే, ఐటీ దాడుల‌తో భ‌య‌పెడుతున్నార‌ని భ‌ట్టి ఆరోపించారు. ఈ దేశ సంప‌ద కొన్ని వ‌ర్గాల‌కు మాత్ర‌మే అందుతోంద‌ని విమ‌ర్శించారు. సోద‌ర‌భావం ఈ దేశంలో లేకండా పోయింద‌ని భ‌ట్టి ఆరోపించారు. ఒక‌రిపై ఒక‌రికి విద్వేష ప‌రిస్థితుల్ని సృష్టిస్తున్నార‌ని భ‌ట్టి అన్నారు. పార్ల‌మెంట్‌కు అంబేద్క‌ర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం స‌రిగ్గా సాగుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. పంజాగుట్ట‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/