ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు..ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు

కొత్త జిల్లా కేంద్రాలుగా విధులు నిర్వర్తించనున్న కలెక్టర్లు, ఎస్పీలు

అమరావతి : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు.

కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఉద్యోగులు, అధికారులను కేటాయించే వరకు పాత జిల్లాల బాధ్యతలను కూడా వీరే చూసుకుంటారు. పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని వీరే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. వీటిని పదో తేదీ వరకు పరిశీలించి తర్వాతి రోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని బిజినెస్ నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపిస్తారు. మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనికి అనుగుణంగా 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/