భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం
ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు కరోనా నిర్ధారణ
కాఠ్మాండూః భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో నేపాల్ అప్రమత్తమైంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది. అంతేకాదు, ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపింది. ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా నేపాల్లోని బైతాడీ జిల్లాలోకి వీరు ప్రవేశించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన నేపాలీలు కూడా కొవిడ్ బారినపడినట్టు పేర్కొన్నారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత పర్యాటకులపై నిషేధం విధించినట్టు తెలిపారు. మరోవైపు నేపాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 1,090 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, టిబెట్లో కేసులు పెరుగుతుండడంతో టిబెట్ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని చైనా నిన్నటి నుంచి మూసివేసింది. చైనాలో నిన్న 828 కొత్త కేసులు బయటపడగా అందులో టిబెట్లో వెలుగు చూసినవే 22 ఉన్నాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/