ఉక్రెయిన్ సరిహద్దుల్లోని డాన్ బాస్ కేంద్రంగా దాదాపు 500 పేలుళ్లు

ఉక్రెయిన్ సరిహద్దుల్లో అటాకింగ్ పొజిషన్ లో రష్యా బలగాలు.. ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశం!

కైవ్ : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని డాన్ బాస్ కేంద్రంగా దాదాపు 500 పేలుళ్లు జరిగినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది.

భారీ సంఖ్యలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించాయని… ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా తెలిపింది. సరిహద్దుల్లో 1,50,000కు పైగా రష్యా ట్రూప్స్ ఉన్నాయని… బుధవారం నుంచి వాటి కదలికలు ఎక్కువయ్యాయని వెల్లడించింది. వీటిలో 40 నుంచి 50 శాతం బలగాలు అటాకింగ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉక్రెయిన్ పై దాడి చేయడానికి అనువుగా ఉన్న అన్ని పాయింట్స్ వద్ద ఈ అటాకింగ్ బలగాలు మోహరించాయని చెప్పింది.

మరోవైపు అమెరికా రక్షణ మంత్రి ఏబీసీ న్యూస్ తో మాట్లాడుతూ… రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని… ఒక చిన్న ఆదేశంతో ఉక్రెయిన్ పై ఏ క్షణంలోనైనా దాడి చేయగలరని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/