మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి
పాకిస్థాన్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తూ చికిత్స కోసం లండన్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గుజ్రాన్వాలాలో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో షరీఫ్ మాట్లాడారు. ఈనేపథ్యంలో ఆయన పాకిస్థాన్ ప్రభుత్వంపైన, ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వాపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్ఖాన్కు అధికారం కట్టబెట్టాడని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ‘జావేద్ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్రధాని పదవి కట్టబెట్టారు’ అని షరీఫ్ వ్యాఖ్యానించారు. కాగా, 2018 ఎన్నికల తర్వాత నవాజ్ షరీఫ్ బహిరంగ సభలో మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగంపై కూడా నవాజ్ విమర్శలు చేశారు. అప్పటి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం పని చేసిందని షరీఫ్ ఆరోపించారు. ఇప్పటికైనా రాజకీయాల్లో పాకిస్థాన్ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు.
దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్థాన్ డెమోక్రటిక్ మూమెంట్ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్నవాజ్ (పీఎంఎల్ఎన్) ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవాజ్ షరీఫ్ను దోషిగా తేల్చిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆయనకు 2017లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో లండన్లో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సంస్కరణలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని నవాజ్ షరీఫ్ విమర్శించారు. ‘మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా ‘మీ టైం అయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/