మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి వరుసగా మూడో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో బుధవారం కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. కాగా.. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను.. ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే, రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు ఎదుట బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముందుగానే ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై మండిపడ్డారు. దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిందాబాద్.. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/