తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ గీతాలాపాన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపాన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యారు. పదకొండున్నరకు ఎక్కడివారు అక్కడే నిల్చొని జాతీయగీతం ఆలపించారు. జనగణమన పాడి దేశభక్తిని మరోసారి చాటారు. ఆబిడ్స్ లో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామూహిక గీతాలాపన జరిగింది. హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాల్లోనూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఈ గీతాలాపన చేశారు.

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ నిల్చున్న వారు అక్కడే నిల్చొని సామూహికంగా జనగణమన ఆలపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు జంక్షన్‌లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. పెద్దఎత్తున ప్రజలు ఒకేచోటు గుమిగూడి జనగణమన ఆలపించారు. చార్మినార్ వద్ద మతసామరస్యం వెల్లివిరిసింది. ప్రజలంతా ఏకమై ఒకే సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 11.30 గంటలకు అందరూ ఎక్కడి వారు అక్కడే జాతీయ గీతాలాపన చేయాలని సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.