రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్

మంచి మిత్రుడ్ని కోల్పోయానంటూ తీవ్ర విచారం

కర్నూలు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు మాజీ ఎంపీపీ రాజావర్ధన్ కుటుంబీకులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. కర్నూలు నెహ్రు నగర్ లో ఇంటికి వెళ్లి రాజా వర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయానంటూ లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి వంటి సమర్థుడైన యువనేతను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాజవర్ధన్ రెడ్డి ఎంతో నిబద్ధత ఉన్న నాయకుడు అని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా సొంత పనుల కోసం రాలేదని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

కాగా, కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన రాజవర్ధన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/