సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన నారా లోకేశ్

పోలవరం నిర్వాసితులు దయనీయంగా ఉన్నారన్న లోకేశ్

అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పేర్కొన్నారు. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సి ఉందంటూ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని ఓసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని లోకేశ్ ఆరోపించారు. భూమి లేనివారికి రూ.10 లక్షలతో ప్యాకేజి ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తానని, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే పట్టా భూమి ఇస్తానని హామీలు గుప్పించారని వివరించారు. మీరు సీఎం అయినా ఒక్క హామీ నెరవేర్చలేదని లోకేశ్ విమర్శించారు.

ఎకరానికి రూ.1.15 లక్షలు పరిహారం ఇచ్చిన భూములకు రూ.5 లక్షలు ఇస్తానని, 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ప్యాకేజి ఇస్తానని, 25 రకాల సదుపాయాలతో నిర్వాసితులందరికీ ప్రత్యేకంగా కాలనీలు నిర్మించి ఇస్తానని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తానని నాడు బహిరంగ సభలో మీరు ప్రకటించిన హామీలన్నింటిని నెరవేర్చాలి అని లోకేశ్ తన లేఖలో డిమాండ్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/