నిందితుల పట్ల అలసత్వం వహిస్తున్నారు

ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైస్సార్సీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని అగనంపూడిలో బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.

బాలిక కుటుంబ సభ్యులు అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. బ్రతుకుదెరువు కోసం వలసవచ్చిన రజక కుటుంబానికి అన్యాయం జరిగిందని నారా లోకేశ్ వివరించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు తప్పంతా బాలికదే అని చేతులు దులుపుకునే పనిలో నిమగ్నం అవ్వడం అన్యాయం అని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/