మీ అరాచకాలు ఇంకెన్నాళ్లు జగన్ గారూః లోకేశ్‌

వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల ఏకగ్రీవానికి ఓప్పుకోకపోతే హత్యలు చేయడం వంటివి స్థానిక ఎన్నికల్లో చూశామన్న లోకేశ్

lokesh-slams-ysrcp

అమరావతిః టిడిపి నేత నారా లోకేశ్‌ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌పై మండిపడ్డారు. ఓటు వేయని వారిపై వేటు వేయడం వైఎస్‌ఆర్‌సిపి నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని విమర్శించారు. తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైఎస్‌ఆర్‌సిపి దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ లు, హత్యలు చేయడం వంటివాటిని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చూశామని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమికి కారణమయ్యాడనే కక్షతో వారి ఇంటిని వైఎస్‌ఆర్‌సిపినేత పోలయ్య కబ్జా చేశాడని మండిపడ్డారు.

అధికారం అండతో పోలయ్య ఇంటిని ఆక్రమించడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డిగారూ అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండని ట్విట్టర్ వేదికగా సూచించారు. దీంతోపాటు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/