క‌బ్జాకోరును అరెస్ట్ చేయాలి : నారా లోకేశ్

ప‌త్తికొండ ఎమ్మెల్యే అనుచ‌రుడు బాబిరెడ్దిపై కబ్జా ఆరోప‌ణ‌లు

అమరావతి: ఏపీలో వైస్సార్సీపీ నేత‌లు క‌బ్జాల ప‌ర్వం కొన‌సాగిస్తున్నార‌ని, అందుకు నిద‌ర్శ‌నంగా క‌ర్నూలు జిల్లాలో ఓ ఘ‌ట‌న నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఓ వ‌రుస ట్వీట్లు చేశారు. వివాదంలో ఉన్న త‌మ కుటుంబ‌ ఆస్తిని క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బినామీ అటికెల‌గుండు బాబిరెడ్డి క‌బ్జా చేశార‌ని మురళీమోహన్‌గౌడ్‌, జయదేవి దంప‌తులు కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిరసన‌కు దిగారు. వీరి వీడియోను ట్యాగ్ చేసిన లోకేశ్..అక్క‌డ జ‌రిగిన విష‌యాల‌ను వివ‌రించారు.

పత్తికొండలోని సర్వే నంబరు 115, 116, 117లో 8.25 ఎకరాల భూమిపై నెల‌కొన్న వివాదం ప్ర‌స్తుతం కోర్టులో ఉంది. ఇదేమీ ప‌ట్ట‌ని వైసీపీ ఎమ్మెల్యే బినామీ బాబిరెడ్డి త‌న‌పేరుతో ఆ భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ట‌. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న ఆ భూమిలో నిర్మాణాల‌ను సైతం మొద‌లెట్టేశార‌ట‌. దీనిని నిల‌దీసిన మురళీమోహన్‌గౌడ్‌, జయదేవిల‌ను చంపుతానంటూ బాబిరెడ్డి బెదిరించార‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ వృద్ధ దంప‌తులు ప్ల‌కార్డుల‌పై రాసుకుని మ‌రీ నిర‌స‌న‌కు దిగారు.

వృద్ధ దంప‌తుల వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన నారా లోకేశ్ క‌బ్జాప‌ర్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు ప‌రిధిలో ఉన్న భూమిని క‌బ్జా చేయ‌డం ఓ త‌ప్ప‌యితే.., అందులో నిర్మాణాల‌కి దౌర్జ‌న్యంగా దిగ‌డం దారుణమ‌ని లోకేశ్ ధ్వ‌జ‌మెత్తారు. నిల‌దీసిన వృద్ధుల్ని చంపుతామ‌ని బెదిరించ‌డం వైసీపీ క‌బ్జాకోరుల అరాచ‌కాల‌కి ప‌రాకాష్ఠ‌గా అభివ‌ర్ణించిన లోకేశ్.. వృద్ధుల‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని.. కోర్టు వివాదంలో వున్న భూమిని క‌బ్జాచేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/