రైతు పాడె మోసిన నారా లోకేశ్
రైతుల చావులపై సిఎం ఎందుకు స్పందిచడం లేదని ఆగ్రహం

అమరావతి: రాజధాని ప్రాంతంలో మృతి చెందిన రైతు కృపానందం కుటుంబాన్ని టిడిపి నేత నారా లోకేశ్ పరామర్శించారు. కృష్ణాయపాలెంలోని రైతు ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం రైతు అంత్యక్రియల్లో పాల్గొని, కృపానందం శవపేటికను లోకేశ్ మోశారు. అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు. రాజధాని తరలిపోతుందనే భాదతోనే కృపానందం మృతి చెందారని లోకేశ్ ఆరోపించారు. అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేసిన జగన్, ఇప్పుడు ఎందుకు రైతుల గురించి మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కనీసం ఈ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదు అని ఆయన మండిపడ్డారు. ఇప్పటివరకు పది మంది రైతులు మరణించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించకుండా సిఎం జగన్పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/