రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం తిరుపతి లో పర్యటించబోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో భారీ వర్షలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టవాటిల్లగా..ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నారు. మొత్తంగా 48 కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించారు. మూడు జిల్లాలోని వరద ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలు అందించారు.

అసెంబ్లీ ఘటన అనంతరం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. నారా భువనేశ్వరి పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా గత నెలలో… చంద్రబాబు నాయుడు అలాగే ఆయన భార్య పై అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే లు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు.. ప్రెస్ మీట్ పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సైతం రంగంలోకి దిగి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో భువనేశ్వరి పర్యటన ఆసక్తిగా మారింది.