ఓకే చోట కలుసుకున్న నాని, వంశీ, వంగవీటి రాధా

ముగ్గురు మిత్రులు ఒకే చోట కలుసుకొని అభిమానుల్లో ఆనందం నింపారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఉన్న కొండాలమ్మ అమ్మవారి ఆలయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి కొడాలి నాని దగ్గరుండి మరీ వంగవీటి రాధాతో పూజలు చేయించారు.

అంతకుముందు వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాధా కార్యాలయానికి వచ్చారు. ఇద్దరు నాయకులు కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకుని అనంతరం రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరులో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాధా వెళ్లారు. ఈ కార్యక్రమానికి మంత్రి వంశీతో పాటు మంత్రి కొడాలి నాని కూడా హాజరయ్యారు.

వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా మాట్లాడుతూ..తన హత్యకు కుట్ర పన్నారంటూ వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. వారిని చూసి భయపడను. ప్రజల్లోనే ఉంటా. నాపై రెక్కీ చేసిన వారి పేర్లు త్వరలోనే బయటకొస్తాయని వంగవీటి రాధా అన్నారు. హత్యకు కుట్ర చేసింది ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. అత్యుత్సాహంతో ఏదో చేద్దామని.. కొందరు ఎదవ వేషాలు వేస్తున్నారన్నారు. తనను పొట్టన పెట్టుకుందామని చూసేవాళ్లకు చెబుతున్నా రెడీగా ఉన్నా.. రంగా కీర్తి, ఆశయ సాధనే తప్ప పదవులపై ఆశ లేదన్నారు. తాను ప్రజల మధ్యే ఉంటానని.. తనను లేకుండా చేయాలనుకుంటున్నవాళ్లను దూరంగా పెట్టాలన్నారు.