మంత్రి పెర్ని నానితో ముగిసిన సినీ పెద్దల సమావేశం

మంత్రి పెర్ని నానితో సినీ పెద్దల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్‌ రాజు, డీఎన్‌వీ ప్రసాద్‌, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ… మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగిందని.. చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమావేశం జరగడం తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని తెలిపారు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు అని.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారన్నారు. టిక్కెట్ల ధరల పెంపు పై చర్చే జరగలేదని… థియేటర్ల మెయిన్టెనెన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ… ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేదన్నారు. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరామని.. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారని వెల్లడించారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు.