సినిమా టికెట్ ధరల విషయంలో చిరు ట్వీట్ కు సానుకూలంగా స్పందించిన పేర్ని నాని

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఏపీ సర్కార్ ను కోరగా ..చిరు ట్వీట్ కు మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. జీవో నెం 35 లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని , టికెట్ ధరల పట్ల ముఖ్యమంత్రి తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇక చిరంజీవి చేసిన ట్వీట్ చూస్తే..”ట్రాన్పరెన్సీ కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుతెరువు కోసం.. కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్టాల్లో ఉన్నట్లు నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్‌ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.