పురందేశ్వరిపై పలు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

వైస్సార్సీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని ..బీజేపీ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఫై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి అడ్డుకుంటున్నారని నాని మండిపడ్డారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

బీజేపీలో పురందేశ్వ‌రి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్నార‌ని, అదే హోదాతో ఆమె గుడివాడ‌కు మంజూరైన ఫ్లై ఓవ‌ర్ల‌ను అడ్డుకుంటున్నార‌ని, ఇప్ప‌టికైనా గుడివాడ అభివృద్ది ప‌నుల‌ను అడ్డు‌కునే య‌త్నాల‌ను విర‌మించాల‌ని ఆయ‌న పురందేశ్వ‌రికి సూచించారు. లేనిప‌క్షంలో పురందేశ్వ‌రి తీవ్ర ప‌రిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

“ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం. ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటాం. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసారు.