తారకరత్న కొద్దిగా కోలుకుంటున్నాడుః నందమూరి రామకృష్ణ

ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తారకరత్న

nandamuri-ramakrishna-gives-tarakaratna-health-update

బెంగళూరుః ఇటీవల గుండెపోటుకు గురైన తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ మీడియాకు వివరాలు తెలిపారు. నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకున్నాడని వెల్లడించారు. డాక్టర్లు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మద్దతును కొద్దిగా తగ్గించారని, మందుల వాడకం కూడా కొద్దిగా తగ్గించారని వివరించారు. గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నట్టు తెలిపారు. అయితే, న్యూరో విషయంలో కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు.

అన్నింటికన్నా శుభపరిణామం ఏమిటంటే, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని నందమూరి రామకృష్ణ తెలిపారు. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, వారి ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.