ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ

తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తున్నారని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అగ్రగామిగా నిలిచారన్నారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు టీడీపీని స్థాపించిన తన తండ్రి, అధికార పగ్గాలు చేపట్టాక పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని, ఆయనకు కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.