25 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ పునఃప్రారంభం

46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగే అవకాశం

హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులకు ఇది గుడ్‌న్యూసే. కరోనా కేసులు పెరగడంతో అర్ధంతరంగా ఆగిపోయిన నాంపల్లి ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు సౌసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం నిన్న తెలిపారు. జనవరి ఒకటో తేదీన 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో 2వ తేదీన అర్ధంతరంగా మూసివేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది.

ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ పునఃప్రారంభానికి అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా నుమాయిష్‌ను మళ్లీ ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఎగ్జిబిషన్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ 46 రోజులపాటు కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/