కొత్త బిజినెస్ చేస్తానంటోన్న కింగ్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. చాలా రోజుల తరువాత నాగ్‌కు సక్సెస్ రావడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక వరుసగా తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేసే పనిలో ఉన్న నాగ్, అటు తన బిజినెస్‌ను కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్వహిస్తున్న నాగార్జున త్వరలో మరో బిజినెస్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తున్నాయో మనకు తెలిసిందే. సినిమా థియేటర్ల తరువాత ఆ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ ఓటీటీలో జరుగుతోంది. దీంతో నాగ్ ఓ సొంత ఓటీటీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాలని చూస్తున్నాడు. అన్నపూర్ణ ఫిలిం అండ్ మీడియా కాలేజీలో కోర్సు చేస్తున్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో నాగ్ ఈ మేరకు ఆలోచన చేస్తున్నాడట. సొంత ట్యాలెంట్‌తో సత్తా ఉన్న ఫిలిం మేకర్స్‌కు ఇది చక్కటి ప్లాట్‌ఫాం అవుతుందని నాగ్ భావిస్తున్నాడు.

మొత్తానికి సినిమాలతో పాటు బిజినెస్ పరంగా కూడా నాగ్ కింగ్ అనిపించుకుంటున్నాడు. ఇక ఈ సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫాంను అతి త్వరలో ప్రకటించి, ప్రారంభించాలని నాగ్ ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి నాగ్ నిజంగానే ఓటీటీ ప్లాట్‌ఫాం మొదలుపెడతాడా అనేది చూడాలి.