చైతూ సినిమాకు కరోనా బ్రేక్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్ యు’ అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మనం ఫేం దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ ఇటలీ వెళ్లారు. కానీ వారికి అక్కడ ఇప్పుడు ఓ పెద్ద షాక్ తగిలింది.

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తారాస్థాయిలో విజృంభిస్తుండటంతో, పలు దేశాల నుండి భారత్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం కూడా భారత్‌కు విమానాలను క్యాన్సిల్ చేయడంతో, థ్యాంక్ యు చిత్ర యూనిట్ షాక్ అయ్యారు. వారు వెంటనే తమ షూటింగ్‌ను మధ్యలో ఆపేసి ఇండియాకు తిరిగి వచ్చేశారు. అటు భారత్ నుండి వచ్చేవారిని కూడా ఇటలీ తమ దేశంలో అనుమతించడం లేదు.

దీంతో అక్కినేని నాగ చైతన్య కొత్త చిత్రం ఆగిపోయిందంటూ టాలీవుడ్‌లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా చాలా రంగాలు మూతపడుతుండగా, ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటం కూడా మంచిదే అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.