మహేష్‌కు బ్యానర్ కట్టి జై కొట్టిన అక్కినేని హీరో

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో లవ్‌స్టోరి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చైతూకి జోడీగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని విలక్షణ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు చైతూ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ‘థ్యాంక్ యూ’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో చైతూ సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తాడని, కథలో భాగంగా ఓ థియేటర్ వద్ద మహేష్ బాబు బ్యానర్‌కు జై కొడుతూ కనబడతాడట. ఇలా ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరో అభిమానిగా తన సినిమాలో నటించడం అనేది చాలా అరుదు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాతో ‘మనం’ లాంటి సక్సెస్‌ను తిరిగి అందుకోవాలని అటు చైతూ, ఇటు దర్శకుడు విక్రమ్ కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.