జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటూ నాదెండ్ల మనోహర్ కామెంట్స్ ..

వైస్సార్సీపీ ప్లీనరీ లో జగన్ ప్రసంగం ఫై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్ చేసారు. సీఎం జగన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారని, అందుకే తమ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లి మేనిఫెస్టో చూపించి తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోగలుగుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్లీనరీ లో తెలిపారు.

దీనిపై నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ..ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పుకోవడం సరికాదని అన్నారు. గడపగడపకు కార్యక్రమం విఫలం కావడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక రూ.1.27 లక్షలతో రైతులను ఆదుకున్నట్టు జగన్ అంటున్నారని, అదే నిజమైతే వైస్సార్సీపీ పాలనలో 3 వేల మంది రైతులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడినట్టు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ప్రతి మహిళ ఖాతాలో రూ.37 వేలు జమ చేశామని చెబుతున్నారని, అయితే డ్వాక్రా మహిళల సొమ్ము రూ.2 వేల కోట్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు. నిజంగానే మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశారా? అయితే మీకు దమ్ముంటే మార్చి లేక ఏప్రిల్ లో ఎన్నికలు జరపండి అని డిమాండ్ చేశారు. ఓవర్ స్పీడు తిరిగితే ఫ్యాను విరిగి కిందపడుతుందని నాదెండ్ల సెటైర్లు వేశారు. వైస్సార్సీపీ మేనిఫెస్టో, సిద్ధాంతం అంతా వ్యక్తి చుట్టే తిరుగుతోందని ఎద్దేశాచేశారు.