నా తండ్రి రాష్ట్ర సిఎం కావాలని కోరుకుంటున్నా: యతీంద్ర సిద్ధరామయ్య

బిజెపి హయాంలో జరిగిన అవినీతిని ఆయనే సరిచేస్తాడని వ్యాఖ్య

my-father-should-be-cm-says-siddaramaiah-son

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ముఖ్యమంత్రిగా తన తండ్రి సిద్ధరామయ్యే ఉండాలని కాంగ్రెస్ నేత యతీంద్ర సిద్ధరామయ్య చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సొంతంగానే ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. గత బిజెపి హయాంలో జరిగిన అవినీతిని సరిచేసే సత్తా తన తండ్రికి మాత్రమే ఉందని యతీంద్ర వివరించారు. కౌంటింగ్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో తన తండ్రికి ప్రత్యామ్నాయంగా మరొకరు లేరని చెప్పారు.

ఓ కొడుకుగా, కన్నడ పౌరుడిగా నా తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని యతీంద్ర వివరించారు. గతంలో ఆయన సుపరిపాలన అందించారని, ఈసారి కూడా రాష్ట్రాన్ని బాగా పాలిస్తారని అన్నారు. బిజెపి పాలనలో జరిగిన అవినీతిని సరిచేస్తారని, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూసినా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కోరుకుంటామని యతీంద్ర తెలిపారు. కాగా, ప్రస్తుతం వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క్లియర్ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకెళుతోంది.