మునుగోడు ఎన్నికల మాజీ అధికారి సస్పెండ్ :కేంద్ర ఎన్నికల సంఘం

డీఎస్పీపైనా క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

munugode-election-officer-suspended

హైదరాబాద్ : మునుగోడులో ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా, లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తును మార్చడం ఇటీవల వివాదాస్పదమైంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. విచారణ అనంతరం జగన్నాథరావును తప్పించిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో మరో అధికారిని నియమించింది.

తాజాగా, ఆయనను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. అంతేకాదు, ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి నేటి ఉదయం 11 గంటలకల్లా ఢిల్లీ పంపాలని ఆదేశించినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అలాగే, ఎన్నికల అధికారికి భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీపైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలియజేయాలని ఎన్నికల సంఘం పేర్కొన్నట్టు వికాస్‌ రాజ్ తెలిపారు.