కరోనా ఎఫెక్ట్..ముంబయి పోర్టు కీలక నిర్ణయం
ఓడల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, సిబ్బందిని ముంబయి ఓడరేవు లోపలకు అనుమతి లేదు
ముంబయి: ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్తో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈనేపథ్యలో ముంబయి పోర్టు ట్రస్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ముంబయిలో ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా ఓడల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, సిబ్బందిని ముంబయి ఓడరేవు లోపలకు అనుమతించేది లేదని ముంబయి పోర్టు ట్రస్టు ఛైర్మన్ సంజయ్ భాటియా ప్రకటించారు. చైనా దేశం నుంచి వచ్చే ఓడల్లో సిబ్బంది, ప్రయాణికులను తమ వైద్యఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు పరీక్షించకుండా ఓడల్లో నుంచి ముంబయి నగరంలోకి అనుమతించమని పోర్టు ట్రస్టు ఛైర్మన్ సంజయ్ భాటియా స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చే ఓడల్లో ఎవరైనా కరోనావైరస్ రోగులు ఉంటే వారిని అత్యవసరంగా కస్తుర్భా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలని ఛైర్మన్ ఆదేశించారు. చైనా ఓడల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్యపరీక్షలు చేయాలని పోర్టు ట్రస్టు అధికారులు నిర్ణయించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/