ముంబయి-గోవా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గురువారం ఉదయం ముంబయి-గోవా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కన్నుమూయగా..ఒకరు గాయాలతో బయటపడ్డారు. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబ సభ్యులంతా కలిసి ఓ వ్యాన్​లో రత్నగిరి జిల్లాలోని గుహాగర్​కు వెళ్తున్నారు. ముంబయి వెళ్తున్న లారీ.. వేగంగా వచ్చి వ్యాన్​ను ఢీకొట్టింది. వ్యాన్​లోని ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు మరణించారు. మరో నాలుగేళ్ల బాలికకు గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని,సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని మన్​గావ్​లోని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.