ఉద్యమ కేసుల ఎత్తివేతపై హర్షం.. సీఎం జగన్ కు లేఖ

ఆ భగవంతుడు మీ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందండి ముద్రగడ పద్మనాభం

అమరావతి : రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తుని రైలు దహనం ఘటనలో కేసుల ఎత్తివేతపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. కాపుల మీద పెట్టిన కేసులను ఎత్తివేసినట్టు మంత్రి కురసాల కన్నబాబు మెసేజ్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు. చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ కేసులు పెట్టడం అన్యాయమని వాపోయారు. తన జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా.. ఆ భగవంతుడు మీ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘బీసీ ఎఫ్’ ఫైలును కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు, ఇప్పుడు మీరు కేసులు ఎత్తేసినప్పుడు తానే వచ్చి ధన్యావాదాలు చెప్పాలనుకున్నా రాలేకపోతున్నానని అన్నారు.

అందరిలాగా తాను కోటీశ్వరుడిని కాదని, మీ ఇద్దరిని కలిస్తే జాతిని అమ్మకం పెట్టి కోట్లు సంపాదించుకున్నారని సమాజం అనుకుంటుందని, అందుకే తాను ముందుకు రాలేదని చెప్పారు. ఆ రెండు విషయాల్లోనూ ఆనందం పొందలేని జీవితమన్నారు. తనకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతులను గుర్తుంచుకుంటే ఎవరూ భవిష్యత్ లో ఉద్యమానికి ముందుకు రారని అన్నారు. చాలా మంది పెద్దవారు మీ వద్దకు వచ్చినా తప్పుబట్టరని, తాను మాత్రం ఎవరినీ కలవకూడదని, తాను ఎప్పుడో చేసుకున్న పాపమో ఏమోనని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/