మాజీ మంత్రి సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) మృతి

కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతూ కన్నుమూత

MSR died
MSR-File

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు (87)(ఎమ్మెస్సార్‌) మృతి చెందారు. కొవిడ్‌ బారిన పడిన ఆయన నిమ్స్‌ లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు కన్ను మూసారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సార్ ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్‌ 1934 జనవరి 14న కరీంనగర్ లో జన్మించారు. 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన నాయకుడిగా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి తరఫున కరీంనగర్‌ నుంచి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. టీపీఎఫ్‌ విలీనంతో కాంగ్రెస్‌ లోకి చేరారు. 1980 నుంచి 1983 వరకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు సుప్రీం కోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌ గా పనిచేశారు. 1990 నుంచి 94 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/