లక్ష్మణ్‌ జట్టులో ధోనీకి దక్కని చోటు

MS Dhoni & VVS Laxman
MS Dhoni & VVS Laxman

ముంబయి: ఇటీవలి కాలంలో మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ టెస్ట్, వన్డే, టీ20 జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా చేరిపోయారు. ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్‌ తన కలల జట్టును ప్రకటించారు. లక్ష్మణ్ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండోర్‌లో శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌నకు తన జట్టును ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ, స్టార్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌కు లక్ష్మణ్‌ తన జట్టులో చోటివ్వలేదు. ఐపీఎల్‌లో రాణించడంపైనే మహీ జట్టుకు ఎంపికవ్వడంపై స్పష్టత రానుంది. అందుకే లక్ష్మణ్‌ చోటివ్వకపోవచ్చు. ధోనీ, ధావన్‌ల విషయం పక్కనపెడితే.. లక్ష్మణ్‌ జట్టులోని మిగతా సభ్యుల ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదు. రోహిత్ శర్మకు జతగా కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు. విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే మిడిల్ భారాన్ని మోయనున్నారు. ఆల్‌రౌండర్‌ల కోటాలో హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజాలకు అవకాశం ఇచ్చారు. పేస్ విభాగంలో మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రాలకు చోటు కల్పించారు. స్పిన్ విభాగంలో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు చోటిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/