అసాంఘిక శక్తులకు బాబు రారాజు: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పట్టాభి తిట్లను సమర్ధించేందుకే వచ్చారా? అని నిలదీశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. కావాలనే పట్టాభితో సీఎం జగన్ ను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి మాటలను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ఏ ప్రయోజనం ఆశించి ఢిల్లీకి వచ్చారని, వ్యవస్థలను మేనేజ్ చేయడానికే వచ్చారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ఒక ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్ట్ ముఠా, అసాంఘిక శక్తులకు రారాజు అన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమిత్ షాపై రాళ్ల దాడి చేసిన వీడియోలను వారికి చూపించారా? అంటూ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 356 ఆర్టికల్ రద్దు కోరుతూ తీర్మానం చేశారని, ఇప్పుడేమో అదే ఆర్టికల్ ను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.

గంజాయి వ్యాపారంలో లోకేశ్ పాత్ర ఉందని, అది ప్రజలకూ తెలుసని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం చేసిందే చంద్రబాబు, లోకేశ్ అని మండిపడ్డారు. బాబు హయాంలో గంజాయి సాగుపై నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చెప్పారో ముందు వినాలని సూచించారు. ఏపీ పరువును చంద్రబాబు తీస్తున్నారని ఆగ్రహించారు. బాబు సంగతి తెలిసే ప్రధాని, హోం మంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులేమీ లేవన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/