సిఎం జగన్కు ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ
పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలి
అమరావతి: నరసాపురం ఎంపి రఘురామకృష్ణరాజు సిఎం జగన్కు లేఖ రాశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపి ప్రభుత్వం కూడా నిర్వహించాల ని కోరుతు ఆయన లేఖ రాశారు. జాతి చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నేతల్లో ఒకరిగా పీవీ నరసింహారావుకు ఎనలేని గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. వేడుకల కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నేనిప్పుడు మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే… పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీలో కూడా నిర్వహించేందుకు మీ తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఆ మహనీయుడికి మరణానంతరం భారతరత్న ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతారని ఆశిస్తున్నాను. పీవీ శతజయంతి ఉత్సవాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ గానీ, శతజయంతి వేడుకల కమిటీని గానీ ఏర్పాటు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తారని భావిస్తున్నాను. సర్, మనం ఈ విధంగా పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తే అది కచ్చితంగా మన పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో లాభిస్తుంది. తెలుగు ప్రజల్లో మన పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి’ అంటూ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/