ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు

ఏపీ ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా అప్పులు చేస్తోంది: రఘురామకృష్ణరాజు

అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ ఆర్థిక పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. అప్పుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా అప్పులు చేస్తోందని తెలిపారు. కేంద్రానికి తెలుపకుండా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటి అప్పులు చేస్తోందని వివరించారు. రాష్ట్రాలు ఎంతమేర అప్పులు చేయొచ్చనే దానిపై కేంద్రం ఓ చట్టం చేసిందని, దాన్ని కూడా అతిక్రమించి అప్పులు చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకుంటున్నారని, బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోందని నివేదించారు. గ్యారంటీలు ఇవ్వలేదని కొందరు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, కానీ ఏ రకంగా గ్యారంటీ ఇచ్చినా గ్యారంటీ గ్యారంటీయేనని రఘురామ స్పష్టం చేశారు.

అప్పులకు సంబంధించిన నియమనిబంధనలు సీఎం జగన్ కు స్పష్టంగా తెలిస్తే మాత్రం ఈ విధంగా అప్పులు చేయడానికి అంగీకరిస్తారని తాను అనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. జగన్ తెలిసి అలాంటి తప్పులు చేయడని విశ్వసించారు కాబట్టే ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని వెల్లడించారు. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నించే సీఎం జగన్ దీనిపై సమీక్షించుకోవాలని హితవు పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/